షాజాహాన్పూర్ (యూపీ), సెప్టెంబర్ 4: ప్రాణాలతో ఉన్న వ్యక్తి తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి కూడా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో న్యాయపోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టు రాశారు.. నేను బతికే ఉన్నాను. లైవ్ సర్టిఫికెట్ ఇప్పించండి మహోప్రభో’ అంటూ ఓ వృద్ధుడు ఏడాదిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. షాజాహాన్పూర్ జిల్లా తిల్హర్ తాసిల్లోని ఫతేపూర్ గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్కు 70 ఏండ్లు. ప్రభుత్వ రికార్డుల్లో ఆయన చనిపోయినట్టు నమోదైంది. ‘కనీసం బ్యాంకు నుంచి నా డబ్బులు కూడా నేను తీసుకోలేకపోతున్నాను. నీరు అందించలేక నా చెరుకు పంట ఎండిపోయింది.
నాకు ఇప్పుడు ఎవ్వరూ సాయం చేయడం లేదు’అని సీనియర్ అధికారుల ఎదుట శనివారం ఓం ప్రకాశ్ వాపోయారు. తన వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ఏడాది క్రితం బ్యాంకుకు వెళ్లినప్పుడు చనిపోయినట్టు రికార్డుల్లో నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. లైవ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అధికారుల బృందానికి ఓం ప్రకాశ్ గ్రామానికి పంపించి విచారణ జరిపిస్తానని తిల్హర్ తాసిల్దార్ జ్ఞానేంద్రసింగ్ తెలిపారు. రికార్డుల్లో చనిపోయినట్టు ఉంటే సరిదిద్ది, ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.