దేశ విభజన సమయంలో బంగ్లా నుంచి వలస వెళ్లిన బెంగాల్ హిందువుల గురించి కూడా ఓ సినిమా తీస్తే బాగుంటుందని వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఇప్పటి వరకూ ఈ విషయంలో సినిమా ఎందుకు రాలేదో అర్థం కావడం లేదన్నారు. కశ్మీరీ ఫైల్స్ సినిమా చూసిన అనంతరం తస్లీమా ఈ వ్యాఖ్యలు చేశారు. తీసిన సినిమా వందకు వంద శాతం నిజమైతే, అందులో ఎలాంటి కల్పితాలు లేకపోతే మాత్రం కశ్మీరీ పండితులు కోల్పోయిన హక్కులు తిరిగి పొందాల్సిందేనని, వారు తిరిగి కశ్మీర్కు వెళ్లాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.
‘ఇవ్వాలే నేను కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాను. ఒకవేళ కల్పితాలు, అర్ధ సత్యాలు లేకపోతే.. వందకు వంద శాతం ఈ సినిమా నిజమైతే… నిజంగా ఇదో విషాదకర కథే. కశ్మీర్ పండితులు తిరిగి కశ్మీర్కు వెళ్లాలి. వారి హక్కులు వారు తిరిగి పొందాలి. దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిన బెంగాలీ హిందువుల గురించి ఇప్పటి వరకూ సినిమా ఎందుకు తీయలేదో నాకు అర్థమే కావడం లేదు’ అంటూ తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.