న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఢిల్లీ కోర్టుకు ఉన్న అధికార పరిధిని ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ సోమవారం ప్రశ్నించారు. రెజ్లర్లు తనపై పెట్టిన కేసులో ఆరోపిస్తున్న ఘటనలు లేదా పరిణామాలు భారత్లో జరుగలేదని పేర్కొన్నారు.
ఈ మేరకు బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది రాజీవ్మోహన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ టోక్యో, మంగోలియా, బల్గేరియా, జకార్తా, కజకిస్థాన్, టర్కీలో లైంగికంగా వేధించాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్నదని, వీటిపై విచారణ జరిపే అధికార పరిధి ఈ కోర్టుకు లేదన్నారు.
బ్రిజ్భూషణ్ న్యాయవాది వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాస్తవ కౌంటర్ ఇచ్చారు. రెజ్లర్లపై అవకాశం చిక్కినప్పుడల్లా నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ వేధింపులను మొత్తంగా ఒకటిగా చూడాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేసును మెజిస్ట్రేట్ నవంబర్ 22కు వాయిదా వేశారు.