న్యూఢిల్లీ, మే 15 (నమస్తే తెలంగాణ): రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ సమస్యను ప్రపంచ ఒలింపియన్ల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తమ సమస్యను అంతర్జాతీయ ఒలింపియన్లకు వివరిస్తూ లేఖలు రాస్తామని, వారి మద్దతు కోరతామని సోమవారం రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్రకటించారు. తమ ఆందోళన జంతర్ మంతర్కే పరిమితమైందని భావిస్తున్నామని, జంతర్ మంతర్ దాటి అడుగులు వేస్తామని మరో రెజ్లర్ సాక్షి మాలిక్ ప్రకటించారు.
తమ ఆందోళన ప్రతి ఒక్కరి వద్దకు చేరాలని, ఇది దేశంలోని మహిళల కోసం జరుగుతున్న పోరాటమని ఆమె పేర్కొన్నారు. 9053903100 నెంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి తమకు మద్దతు తెలపాలని ఆమె కోరారు. కాగా, రెజ్లర్ల ఆందోళన సోమవారానికి 23 రోజులకు చేరుకుంది. జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, బీజేపీ నేత చౌదరి బీరేంద్ర సింగ్ వారికి మద్దతు తెలిపారు.