ముంబై: పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేని దత్తత తల్లిదండ్రులు ట్రస్ట్కు తిరిగి అప్పగిస్తామని చెప్పారు. దీంతో ఆ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ బాలుడితో అనుబంధం పెంచుకోలేకపోతున్నట్లు దత్తత పేరెంట్స్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లవాడి దత్తతను కోర్టు రద్దు చేసింది. (Adoptive Parents Return Child) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. 2023 ఆగస్ట్ 17న బాల ఆశా ట్రస్ట్ నుంచి ఒక బాలుడ్ని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అయితే పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేక తిరిగి అప్పగిస్తామని ట్రస్ట్కు చెప్పారు.
కాగా, పిల్లవాడి పెంపకంపై కౌన్సిలింగ్కు వెళ్లాలని ఆ ట్రస్ట్ సూచించింది. దీంతో దత్తత తల్లిదండ్రులు రెండుసార్లు కౌన్సిలింగ్కు వెళ్లారు. అయినప్పటికీ ఏడేళ్ల సొంత కుమార్తె మాదిరిగా దత్తత బాలుడితో అనుబంధం, మమకారాన్ని పెంచుకోలేకపోయారు. చెడు అలవాట్లు భరించలేక ఆ బాలుడ్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో ఆ ట్రస్ట్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
మరోవైపు 2023 డిసెంబర్లో బాల ఆశా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఆర్ఐ చాగ్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. దత్తత తల్లిదండ్రులు ఆ బాలుడితో అనుబంధాన్ని పెంచుకోలేక పోవడంతో పిల్లవాడి శ్రేయస్సు దృష్ట్యా దత్తతను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దత్తత పేరెంట్స్ చేసిన రెండు లక్షల డిపాజిట్ను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దత్తత తల్లిదండ్రులు ఆ బిడ్డకు సంబంధించిన అన్ని ఒరిజినల్ డ్యాకుమెంట్లు, పత్రాలను వెంటనే ఆ ట్రస్ట్కు అప్పగించాలని కోర్టు పేర్కొంది. అలాగే ఆ బాలుడ్ని తిరిగి ఉచితంగా దత్తత ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయాలని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది.