మంచి ఆకలితో పిజ్జా ఆర్డర్ ఇచ్చిన అతను తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు. ఎందుకంటే తన పిజ్జా నిండా తెల్లని పురుగులే ఉన్నాయి. అవి చూసిన వెంటనే సదరు పిజ్జా షాపు నెంబర్కు ఫోన్ చేసి కంప్లయింట్ చేశాడు. ఆ షాపు మేనేజర్ ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
దీనిపై వినియోగదారుల కోర్టుకు వెళ్లిన సదరు కస్టమర్కు రూ.7 వేల నష్టపరిహారం చెల్లించాలని సదరు పిజ్జా షాప్ యజమానిని కోర్టు ఆదేశించింది. హరియాణాకు చెందిన హర్కీరత్ సింగ్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. హోషియార్పురాలో నివశించే అతను మూడేళ్ల క్రితం ఉబర్ ఈట్స్ యాప్ ద్వారా ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. ‘కెప్టెన్ శామ్స్’ పిజ్జా చైన్ నుంచి ఈ ఆర్డర్ వచ్చింది.
తనకు వచ్చిన పిజ్జాలో పురుగులు ఉన్నట్లు చూసిన హర్కీరత్.. ఆ షాపు మేనేజర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఉబర్ ఈట్స్కు కూడా ఫిర్యాదు చేశాడు. వాళ్లెవరూ అతనికి సరైన సమాధానం ఇవ్వలేదు. అదే రోజు సాయంత్రం హర్కీరత్ ఆస్పత్రి పాలయ్యాడు. అతని తిన్న ఆహారం వల్ల విరేచనాలు, వాంతులు పట్టుకున్నాయి.
చికిత్స అనంతరం హర్కీరత్.. తన ఫిర్యాదు తీసుకొని కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం.. 45 రోజుల్లోగా అతనికి రూ.7 వేలు జరిమానా చెల్లించాలని ఉబర్ ఈట్స్, కెప్టెన్ శామ్ సంస్థలను ఆదేశించింది. లేదంటే ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజులపాటు 12 శాతం వడ్డీ పడుతుందని హెచ్చరించింది.