IND vs PAK | అహ్మదాబాద్లో హోటల్ రూమ్ రేట్లు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. కేవలం ఒక్క రోజు కోసమే లక్ష రూపాయల దాకా కూడా వసూలు చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఒక్కరోజుకు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా ఉన్న అద్దెను రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పెంచేశారు. ఏంటి ఒక్కరోజులోనే అంతలా ఎందుకు పెంచేశారని ఆలోచిస్తున్నారా? వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ను నిన్ననే ఐసీసీ విడుదల చేయడమే ధరల పెంపునకు ప్రధాన కారణం.
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల్లో తొలి మ్యాచ్, ఫైనల్ సహా ఐదు మ్యాచ్లు అహ్మదాబాద్లోనే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్లు అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. దాయాదీ దేశాల మధ్య ఫైట్ అంటే క్రికెట్ అభిమానులకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కచ్చితంగా ఈ మ్యాచ్ను చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచి కచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్ తరలివస్తారు. ఇదే అదను అని భావించి అహ్మదాబాద్లోని హోటల్ యాజమాన్యాలు ఆ తేదీన రూమ్ టారిఫ్లను 10 రెట్లు పెంచేసింది. సాధారణ రోజుల్లో రూ.5,000 నుంచి రూ.8,000 వరకు ఉండే ఫైవ్ స్టార్ హోటల్ గది అద్దెను ఏకంగా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచేశారు.
బుకింగ్ డాట్కామ్ వెబ్సైట్ ప్రకారం.. ఐటీసీ హోటల్లో జూలై 2వ తేదీన ఒక డీలక్స్ రూమ్కి ఒక్కరోజు అద్దె రూ.5,699 ఉండగా.. అదే హోటల్లో అదే గదికి అక్టోబర్ 15న రూ.71,999 ఛార్జ్ చేస్తున్నారు. అదే ప్రైడ్ హోటల్లో 36,180 వసూలు చేస్తున్నారు. ది కామా హోటల్లో అయితే రూ.3వేలు అద్దె ఉంటే దాన్ని రూ.27,233కి పెంచేశారు. అక్టోబర్ 15వ తేదీన ఐటీసీ నర్మదా, మారియట్, హయత్, తాజ్ స్కైలైన్ సహా అహ్మదాబాద్లోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్లో ఒక్క రూం కూడా ఖాళీగా లేకపోవడం గమనార్హం. డిమాండ్కు అనుగుణంగా హోటల్స్ అన్నీ రేట్లు పెంచేశాయని గుజరాత్లోని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) అధికార ప్రతినిధి అభిజీత్ దేశ్ముఖ్ వెల్లడించారు. అహ్మదాబాద్లో మ్యాచ్లు జరిగే తేదీల్లో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి క్రికెట్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ఆయా రోజుల్లో హోటల్స్ తమ టారిఫ్లు పెంచేస్తున్నాయని చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలోనే నాలుగు రాళ్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా రోజుల్లో రేట్లు పెంచుతున్నారని.. ఒక్కసారి డిమాండ్ తగ్గిపోగానే రేట్లు మళ్లీ తగ్గిస్తారని చెప్పుకొచ్చారు.