న్యూఢిల్లీ: భూ వాతావరణం దశాబ్ధ కాలంలో సగటున 0.2 డిగ్రీల సెల్సియస్తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఓ హెచ్చరిక కూడా చేశారు. 2013 నుంచి 2022 వరకు మానవుల వల్ల కలుగుతున్న పర్యావరణ మార్పులతోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ స్టడీకి చెందిన రిపోర్టును ఇటీవల పబ్లిష్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ పీయర్స్ ఫోర్స్టర్ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించారు. గ్రీన్హౌజ్ గ్యాసుల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(IPCC Report) సైంటిస్టులు పేర్కొన్నారు.
పర్యావరణంపై పారిస్ ఒప్పంద లక్ష్యాలను అందుకోవాలంటే, 2035 నాటికి గ్రీన్హౌజ్ వాయువులను 60 శాతం తగ్గించాలని సైంటిస్టులు తెలిపారు. కార్బన్ డైయాక్సైడ్, మీథేన్, ఇతర శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.