చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని విభజించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ అధిష్ఠాన నేతలు స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతాన్ని ‘కొంగు నాడు’ ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. కాగా, తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు ‘కొంగు నాడు’ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ మురుగన్ ఇటీవల కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అయితే బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే, అధికార డీఎంకేతోపాటు వామపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొండునాడుపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడును విభజించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసినట్లు టైమ్స్ నౌ పేర్కొంది.