న్యూఢిల్లీ: రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలు రాసేందుకు వచ్చిన అమ్మాయిలకు బికనీర్లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అవమానం జరిగింది. నిండు చేతుల దుస్తులు వేసుకురావద్దన్న నిబంధన గురించి తెలియక ఫుల్ హ్యాండ్స్ టాప్స్తో వచ్చిన మహిళా అభ్యర్థలను ఆ పరీక్ష కేంద్రం నిర్వాహకులు అవమానపర్చారు. సెక్యూరిటీ సిబ్బందితో ఫుల్హ్యాండ్స్ దుస్తులు వేసుకొచ్చిన వారి స్లీవ్స్ను కట్ ( Sleeves cutting ) చేయించారు.
అయితే, కొందరు మహిళలకు లేడీ సిబ్బంది స్లీవ్స్ కట్ చేయగా.. మరికొందరు మహిళలకు పురుష సిబ్బంది స్లీవ్స్ కట్చేశారు. మహిళా అభ్యర్థుల స్లీవ్స్ను పురుషులైన సెక్యూరిటీ సిబ్బందితో కట్ చేయించడం అమానుషమని జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. బాధ్యులపై రాజస్థాన్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు. ఘటనను సుమోటోగా స్వీకరించినట్లు తెలిపారు.