న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే బ్రిజ్భూషణ్ మిమ్మల్ని తాకరాని చోట తాకినట్లుగా ఫొటో, వీడియో లేదా ఆడియో ఆధారాలు ఉంటే ఇవ్వాలని.. బాధితులైన ఇద్దరు మహిళా రెజ్లర్లను పోలీసులు కోరారు. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది.
బ్రిజ్భూషణ్ తమను 2016 నుంచి 2019 మధ్య లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇద్దరు మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వాసను పరీక్షించే నెపంతో ఆయన తమ ఛాతిపై చేతులు వేసేవాడని, అక్కడి నుంచి చేతులను కిందకు జారుస్తూ పొట్టపై నొక్కేవాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
దాంతో రెజ్లర్లు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నూతన పార్లమెంట్ ప్రారంభం రోజు రెజ్లర్లు పార్లమెంటు ముందే ధర్నాకు ప్రయత్నించడంతో పోలీసులు అమానుషంగా వాళ్లను ఈడ్చిపారేశారు. అయినా రెజ్లర్లు తమ ఆందోళనను విరమించలేదు. దాంతో దిగొచ్చిన కేంద్రం ఈ నెల 15లోగా కేసు విచారణ పూర్తి చేయిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చింది. దాంతో రెజ్లర్లు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.