న్యూఢిల్లీ, ఆగస్టు 18: లింగ సమానత్వం దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్హులైన మహిళా అభ్యర్థులను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను ఆదేశించింది. తుది తీర్పునకు లోబడి పరీక్ష ఫలితాలు ఉంటాయన్నది. ఎన్డీఏ పరీక్ష సెప్టెంబరు 5న జరుగనున్నది. ఎన్డీఏ పరీక్ష రాయడానికి, శిక్షణ పొందడానికి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులను అనుమతించాలని కోరుతూ కుష్ కల్రా అనే అభ్యర్థిని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఏలోకి మహిళలకు అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని వాదనల సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ ) ఐశ్వర్య భాటీ తెలిపారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ ఆర్మీ, నేవీలో మహిళలకు పర్మినెంట్ కమిషన్ (పీసీ) ఇవ్వాలని సుప్రీం ఆదేశించిన తర్వాత కూడా ప్రభుత్వం తన పంథాను మార్చుకోలేదా అని ప్రశ్నించింది. ‘ఆర్మీ ఏ పనీ స్వచ్ఛందంగా చేయదా? ప్రతిదానికీ ఆదేశాలివ్వాలా?’ అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశించే వరకు మహిళలకు పీసీని మీరు వ్యతిరేకిస్తూనే ఉన్నారని గుర్తుచేసింది.
‘ఆర్మీలోకి ప్రవేశించడానికి ఎన్డీఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) వంటి మార్గాలు ఉన్నాయి. ఓటీఏ, ఐఎంఏ ద్వారా మహిళలు ఆర్మీలోకి రావచ్చు’ అని ఏఎస్జీ తెలిపారు. దీనిపై కోర్టు స్పదిస్తూ ‘ఎన్డీఏ ద్వారా ఎందుకు ప్రవేశించకూడదు? కో-ఎడ్యుకేషన్ ఏమైనా సమస్య అవుతుందా?’ అని ప్రశ్నించింది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో లింగవివక్ష ఉన్నదని తేల్చిచెప్పింది. ఈ దృక్పథం మారాలని, కానీ మారడం లేదని వ్యాఖ్యానించింది. మహిళలకు అవకాశాల విషయంలో ఆర్మీ కంటే ఎయిర్ఫోర్స్, నేవీ ఉదారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఆర్మీలో చాలామంది మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇచ్చారని ఈ సందర్భంగా ఏఎస్జీ తెలిపారు.