న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ‘మహిళల్లారా ఏకం కండి.. పోరాడితే పోయేదేం లేదు. సంకెళ్లు తప్ప. న్యాయవ్యవస్థలో 50% రిజర్వేషన్ల కోసం నిస్సహాయతతో కాక ఆగ్రహంతో గొంతెత్తండి. మీ డిమాండ్ను బలంగా వినిపించండి. రిజర్వేషన్లు దయతలచి ఇచ్చేవి కావు. అది మీ హక్కు’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మహిళలకు రిజర్వేషన్ డిమాండ్కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పారు. సుప్రీంకోర్టులోని మహిళా అడ్వకేట్లు ఆదివారం జస్టిస్ రమణ, కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. కార్ల్మార్క్స్ నినాదాన్ని ఉటంకించారు. దాన్ని కొద్దిగా మార్చి చెప్తానంటూ మహిళలకు అన్వయించారు. దేశవ్యాప్తంగా అన్ని లా స్కూళ్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. తద్వారా న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పారు. మహిళా హక్కులు అనేవి వేల ఏండ్లుగా కొనసాగుతున్న అణచివేతకు సంబంధించిన అంశమన్నారు. ‘కొన్ని వాస్తవాలను ఆలస్యంగా గ్రహిస్తాం. ఇది చాలా దురదృష్టకరం. న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కల నిజం అయితే నేను చాలా సంతోషిస్తాను’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉందన్నదానిపై జస్టిస్ రమణ ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.
హైకోర్టు జడ్జిల్లో 11 శాతమే మహిళలు
జిల్లా కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 30% కంటే తక్కువ ఉన్నారని, హైకోర్టుల్లో 11.5% మాత్రమేనని జస్టిస్ రమణ తెలిపారు. సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం 11 శాతం మాత్రమే ఉందన్నారు. ‘దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే అందులో మహిళలు 15 శాతమే. రాష్ర్టాల బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రతినిధులు 2 శాతమే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేరు. దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాతో మాట్లాడాను. మీ బార్ కౌన్సిల్ నేషనల్ కమిటీలో ఒక్కరు కూడా మహిళా ప్రతినిధి లేరు ఎందుకని అడిగాను. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది అని చెప్పాను’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
22% కోర్టుల్లో ప్రత్యేక టాయిలెట్లు లేవు
కోర్టుల్లో మౌలిక సదుపాయాల లోటు, మహిళలు ఎదుర్కొనే సమస్యలపైనా జస్టిస్ రమణ మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా 6వేల కోర్టులున్నాయి. వీటిలో 22% కోర్టుల్లో మహిళల కోసం కనీసం ప్రత్యేక టాయిలెట్లు కూడా లేవు’ అన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అందుకే నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ప్రతిపాదించినట్టు తెలిపారు. దసరా తర్వాత కోర్టులో భౌతిక విచారణ ప్రారంభం కావొచ్చన్నారు.