డెహ్రాడూన్: అత్యాచార చట్టానికి సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన అత్యాచార చట్టాన్ని (ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 376 ను) కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. గొడవలు జరిగినప్పుడు కొందరు మహిళలు ఈ చట్టాన్ని తమ పురుష భాగస్వాములపై ఆయుధంలా ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
నిందితుడు తనను పెళ్లి పేరు చెప్పి శారీరకంగా అనుభవించాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ శరద్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత సదరు మహిళ నిందితుడికి వివాహం జరిగిందని తెలిసిన తర్వాతనే అతనికి దగ్గరైందని, కాబట్టి పెళ్లి పేరుతో ఆమెను నిందితుడు లోబర్చుకున్నాడనే ఆరోపణ చెల్లుబాటు కాదని పేర్కొంటూ ఆ పిటిషన్ను కొట్టివేసింది.