Bihar | బార్హ్(బీహార్), డిసెంబర్ 24: తల్లి ప్రేమకు సాటి లేదంటారు. అలాంటి తల్లి ప్రేమను చాటిచెప్పే ఘటన ఒకటి శనివారం బీహార్లోని బార్హ్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఏదైనా ప్రమాదం ఎదురైతే, కోడి తన పిల్లలను కడుపులో దాచుకొని ఎలా కాపాడుకుంటుందో.. ఆ తల్లి కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా తన ఇద్దరు పిల్లలను ఒడిలో దాచుకొని పెద్ద రైలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం బార్హ్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడి ఉన్న క్రమంలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు.
అయితే తోపులాటలో ప్లాట్ఫామ్కు, రైలుకు మధ్య ఉండే ఖాళీ స్థలంలో తన ఇద్దరు పిల్లలతో సహా ఆమె పడిపోయారు. దీన్ని ఎవరూ గమనించలేదు. తర్వాత వెంటనే రైలు బయలుదేరింది. అయితే తన తన పిల్లలను రక్షించుకోవడానికి ఆ తల్లి మనసు తపించింది. వెంటనే తన శరీరంతో పిల్లలను చుట్టేసుకొని కదలకుండా అలాగే వంగి పడుకుంది. అంగుళాల గ్యాప్లో వారి పక్కనుంచి రైలు వెళ్లింది. అదృష్టవశాత్తూ వారికి ఏమీ కాలేదు. రైలు వెళ్లిన తర్వాత స్థానికులు మహిళను, పిల్లలను పైకి చేర్చి తగిన సపర్యలు చేశారు. తర్వాత చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.