న్యూఢిల్లీ : పెంపుడు జంతువులతో మనుషుల అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. తమ పెంపుడు కుక్కకు ఓ మహిళ సీమంతం చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుజాత భారతి అనే మహిళ ఈ వీడియో షేర్ చేసినప్పటినుంచి ఇప్పటివరకూ 50 లక్షల మంది వీక్షించారు.
ఈ వీడియోలో కుక్కను కొత్త బట్టలతో సుజాత అలంకరించి దానికి పసుపు కుంకుమ దిద్దడం చూడొచ్చు. కుక్కకు ఇష్టమైన ఆహార పదార్ధాలతో నిండిన ప్లేట్లు కనిపించాయి. చివరిగా ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్ధాలను సుజాత వీధి కుక్కలకు పంచడం నెటిజన్లను ఆకట్టుకుంది. మా బేబీకి సీమంతం అని వీడియోకు క్యాప్షన్గా ఇచ్చారు. సుజాత తన పెంపుడు కుక్క పట్ల చూపిన ఆదరణను పలువురు యూజర్లు ప్రశంసించారు.