అహ్మదాబాద్ : తమ ఇంట్లోకి చొచ్చుకువచ్చిన వ్యక్తులను నిలదీయడంతో మహిళను తీవ్రంగా కొట్టి చంపిన ఇద్దరు సోదరుల ఉదంతం గుజరాత్లోని రాజ్కోట్లో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. మృతురాలిని షబ్నం చౌహాన్ (30)గా గుర్తించారు. ఆమెకు భర్త, ఐదేండ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు.
తమ ఇంటి విషయాలపై ఆరా తీస్తున్న పొరుగున ఉండే సోను, శంభులను ఆమె మందలించింది. దీంతో కోపం పెంచుకున్న నిందితులు భర్త లేని సమయంలో బాధితురాలిని వేధించారు. కిటికీలోంచి మహిళ ఇంట్లోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నించగా ఆమె అడ్డుచెప్పింది. ఆపై నిందితులు ఇద్దరూ మహిళ ఇంట్లోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చి ఆమె జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చి ఇనుప పైప్తో తీవ్రంగా కొట్టి పరారయ్యారు.
కుటుంబ సభ్యులు భర్త సంతోష్కు సమాచారం ఇవ్వడంతో అతడు ఇంటికి వచ్చేసరికి భార్త రక్తపుమడుగులో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా సోనును అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడు శంభు కోసం గాలిస్తున్నారు.