న్యూఢిల్లీ: జ్యోతిష్యం నేర్చుకునే నెపంతో ఒక వ్యక్తి జ్యోతిష్కురాలితో పరిచయం పెంచుకున్నాడు. తన స్నేహితుడి గదికి ఆమెను రప్పించాడు. మత్తు మందు కలిపిన డ్రింక్ తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు. (Woman tarot reader raped by man) బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల మహిళ జ్యోతిష్యం చెబుతుంది. ఈ ఏడాది జనవరిలో ఒక ఆస్తి అమ్మకం కోసం 40 ఏళ్ల గౌరవ్ అగర్వాల్ను ఆమె సంప్రదించింది. అయితే తనకు జ్యోతిష్యం నేర్పించాలని కోరిన అతడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
కాగా, జనవరి 24న ఆస్తి అమ్మకం గురించి మాట్లాడే సాకుతో ఆ మహిళను తన స్నేహితుడి ఇంటికి గౌరవ్ అగర్వాల్ రప్పించాడు. మత్తు మందు కలిపిన డ్రింక్ ఆమెకు ఇచ్చాడు. మగతలో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న బాధిత మహిళ ఫిబ్రవరి 10న జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి గౌరవ్ అగర్వాల్ ఆఫీస్కు వెళ్లి అతడ్ని నిలదీశారు.
మరోవైపు తాను ఏ తప్పు చేయలేదని గౌరవ్ అగర్వాల్ బుకాయించాడు. భార్యాభర్తలను తిట్టడంతోపాటు చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో జ్యోతిష్కురాలైన ఆ మహిళ ఫిబ్రవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.