లక్నో: భూమి విషయంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ రోజురోజుకు మరింత ముదిరి ఒకరి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలోని పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బసెండా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. డోలి, పప్పూ ఇద్దరూ పదేండ్ల క్రితం వరకు అన్నా వదినలు. పదేండ్ల క్రితం పప్పూ సోదరుడు అనారోగ్యం కారణంగా మృతిచెందడంతో వదిన డోలీని పప్పూ పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భూమి విషయమై ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అయితే, సోమవారం కూడా భూమికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవ జరుగగా.. పప్పూ తన భార్య డోలీని కాల్చిచంపేశాడు.