జైపూర్: లైంగిక దాడి బాధితురాలైన మహిళపై నిందితుడు కాల్పులు జరిపాడు. అనుచరులతో కలసి ఆ మహిళ, ఆమె సోదరుడిపై గొడ్డలితో దాడి చేశాడు. (Woman Shot At, Attacked With Axe) ఆ నిందితుడు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. రాజస్థాన్లోని కోట్పుట్లీ-బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజేంద్ర యాదవ్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 24 ఏళ్ల మహిళ గత ఏడాది జూన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేయడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఇటీవల బెయిల్పై విడుదలైన రాజేంద్ర యాదవ్, కేసును వెనక్కి తీసుకోవాలని బాధిత మహిళను బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
కాగా, శనివారం సోదరుడితో కలిసి బైక్పై ఇంటికి తిరిగి వస్తున్న బాధిత మహిళపై ప్రాగ్పురా గ్రామంలో రాజేంద్ర యాదవ్ దాడి చేశాడు. ఆ మహిళ వెనుక భాగంలో గన్తో కాల్పులు జరిపాడు. అనంతరం తన అనుచరులతో కలిసి ఆ మహిళ, ఆమె సోదరుడిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. బాధిత మహిళ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతోపాటు సోదరుడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన ఈ దాడి సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో రాజేంద్ర యాదవ్ ఇద్దరు అనుచరులైన మహిపాల్ గుర్జార్, రాహుల్ గుర్జార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాజేంద్ర యాదవ్ ఒక కాలు కోల్పోయి తీవ్ర గాయాలతో జైపూర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడు ప్రమాదవశాత్తు గాయపడ్డాడా? లేక రైలు కింద పడి ఆత్మహత్య చేసునేందుకు ప్రయత్నించాడా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే స్థానిక నాయకులతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆరా తీస్తున్నారు.