Crime News | భువనేశ్వర్ : విధి నిర్వహణలో ఉన్న ఓ వైద్యుడిని మహిళ చెప్పుతో కొట్టింది. తన కుమార్తె పోస్టుమార్టం నివేదిక ఎందుకు తప్పుగా ఇచ్చారంటూ ఆ మహిళ అరిచింది. ఈ ఘటన పర్లాఖెముండి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పర్లాఖెముండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో సౌధామిణి రైతా అనే బాలిక.. గతేడాది ఫిబ్రవరి 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని సౌధామిణి తల్లి సుజ్ఞాని గమాంగ్కు స్కూల్ టీచర్లు తెలిపారు. దీంతో సౌధామిణి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన సుజ్ఞాని, తన బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని పేర్కొన్నారు.
సుజ్ఞాని ఫిర్యాదు మేరకు పర్లాఖెముండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. సౌధామిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆ కేసు అక్కడితో ఆగిపోయింది.
సరిగ్గా ఏడాది తర్వాత తల్లి సుజ్ఞాని.. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని పోస్టుమార్టం నివేదిక ఇచ్చిన డాక్టర్పై దాడి చేసింది. అతన్ని చెప్పుతో కొట్టి, ఫోన్ను నేలకేసి కొట్టింది. తన బిడ్డ పోస్టుమార్టం నివేదిక ఎందుకు తప్పుగా ఇచ్చారంటూ డాక్టర్ను నిలదీసింది. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, ఆ విషయాన్ని పోస్టుమార్టం నివేదికలో ఎందుకు ప్రస్తావించలేదని తల్లి ప్రశ్నించింది.
ఈ ఘటనపై బాధిత డాక్టర్ రష్మి రంజన్ మిశ్రా స్పందించారు. తనపై దాడి చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను రోగులను పరీక్షిస్తున్న సమయంలో తన ఛాంబర్లోకి దూసుకొచ్చి దాడి చేసిందని, అసభ్య పదజాలంతో దూషించిందని డాక్టర్ పేర్కొన్నారు.