న్యూఢిల్లీ: తల్లి ఇంటికి కూతురు కన్నం వేసింది. చెల్లి పెళ్లి కోసం ఉంచిన నగలు, నగదును చోరీ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఇంటి దొంగను పట్టుకున్నారు. పెద్ద కుమార్తె బురఖా ధరించి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జనవరి 30న ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన కమలేష్ అనే మహిళ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం తాను ఇంట్లో లేనప్పుడు బీరువాలో దాచిన లక్షల విలువైన నగలు, రూ.25,000 చోరీ అయ్యాయని ఫిర్యాదు చేసింది.
కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటిని పరిశీలించారు. మెయిన్ డోర్, బీరువా చెక్కుచెదరకుండా ఉండటంతో ఆ ఇంట్లోకి బలవంతంగా ఎవరూ ప్రవేశించలేదని గ్రహించారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బురఖా ధరించిన మహిళ ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుసుకున్నారు. కమలేష్ పెద్ద కుమార్తె అయిన 31 ఏళ్ల శ్వేతగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు కొంతకాలంగా తల్లి ఇంట్లోనే ఉన్న శ్వేత అప్పులపాలైంది. వాటి నుంచి బయటపడేందుకు చెల్లి పెళ్లి కోసం ఉంచిన నగలను చోరీ చేయాలని భావించింది. దీని కోసం ప్లాన్ వేసింది. జనవరిలో తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉంటున్నది. దీంతో తన పనుల తర్వాత తల్లి ఆమె వద్దకు వచ్చేది.
కాగా, జనవరి 30న తన ఇంటికి వచ్చిన తల్లి వద్ద ఉన్న ఇంటి తాళాలను శ్వేత కాజేసింది. కూరగాయలు కొనే నెపంతో బయటకు వెళ్లింది. పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి బురఖా ధరించింది. ఆ తర్వాత తల్లి ఇంటికి వెళ్లింది. తన వద్ద ఉన్న తాళంతో డోర్, లోపలున్న బీరువా తెరిచింది. అందులో ఉన్న లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25,000 చోరీ చేసింది. చివరకు ఆమెను పోలీసులు గుర్తించడంతో ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే నగలను అమ్మేసినట్లు శ్వేత చెప్పగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.