Air India Case | ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు వృద్ధ మృహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని, ఆమెనే మూత్రం పోసుకున్నట్లు శంకర్ మిశ్రా ఢిల్లీ కోర్టులో శుక్రవారం చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతని ఆరోపణలను బాధిత మహిళ తాజాగా ఖండించింది. అతను చెప్పేవన్నీ అబద్దాలే అని పేర్కొంది.
‘నిందితుడు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. అవి పూర్తిగా అవాస్తవం. అతను కావాలనే అలా చెప్తున్నాడు. శంకర్ మిశ్రా తన బెయిల్ దరఖాస్తులో పేర్కొన్న విషయాలు, కోర్టులో చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నేను అనుభవించిన ఇలాంటి భయానక పరిస్థితిని మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో నేను ఈ ఫిర్యాదు చేశా’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. నవంబర్ 26న న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తాగుబోతు తన సీటు వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్ ఇండియా చైర్మన్కు రాసిన లేఖలో ఆరోపించిన విషయం తెలిసిందే. బట్టలు, బ్యాగులు, బూట్లు పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వెళ్లిపోయినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఘటనపై దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పోలీసులు బెంగళూరులో శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకొని.. ఢిల్లీ కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.