చెన్నై: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన ప్రియుడిపై ఒక మహిళ కాగుతున్న వేడి నూనె (woman pours hot oil) పోసింది. దీంతో అతడి ముఖం, చేతులకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భవానీలోని వర్ణపురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల కార్తీ, పెరుందురైలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బంధువైన మీనా దేవితో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే కార్తీకి మరో మహిళతో పెళ్లి సంబంధం కుదిరినట్లు మీనా దేవికి తెలిసింది. ఈ విషయంపై కార్తీని ఆమెను నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య తరచుగా ఈ విషయంపై గొడవ జరుగుతున్నది.
కాగా, శనివారం రోజు మీనా దేవిని కలిసేందుకు ఆమె ఇంటికి కార్తీ వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పెళ్లి విషయంపై మరోసారి వాగ్వాదం జరిగింది. తనను మోసగించాడన్న ఆగ్రహంతో మీనా దేవి రగిలిపోయింది. స్టవ్పై మరుగుతున్న వేడి నూనెను కార్తీపై పోసింది. అతడి ముఖం, చేతులపై వేడి నూనె పడింది. దీంతో కాలిన బాధతో కార్తీ కేకలు వేశాడు. అతడి అరుపులు విన్న పొరుగు వారు వెంటనే అక్కడకు వచ్చారు. కార్తీని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మీనా దేవి ఇంటికి చేరుకున్నారు. జరిగిన సంగతి ఆరా తీశారు. ప్రియుడు కార్తీపై వేడి నూనె పోసిన ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.