భువనేశ్వర్: జూద గృహంపై పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు వ్యక్తులు మహిళా పోలీస్ అధికారిణిపై దాడి చేశారు. అలాగే ఆమెను, పోలీస్ సిబ్బందిని గదిలో బంధించారు. (Woman Cop Locked In Room) ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తలసరి మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంపాబాటి సోరెన్, ముగ్గురు పోలీస్ సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహించారు. ఉదయపూర్ గ్రామంలో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీస్ అధికారిణి చంపాబాటి తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై రైడ్ చేశారు.
కాగా, జూదం ఆడుతున్న వ్యక్తులు పోలీసులను చూసి రెచ్చిపోయారు. పోలీస్ అధికారిణి చంపాబాటి, ఆమె సిబ్బందిపై దాడి చేశారు. అలాగే వారిని ఒక గదిలో బంధించారు. అయితే భోగ్రాయ్ పోలీస్ స్టేషన్, చందనేశ్వర్ అవుట్పోస్ట్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో పోలీసులు ఆ జూద గృహానికి చేరుకున్నారు. గదిలో బంధించిన పోలీస్ అధికారిణి చంపాబాటి, ఆమె సిబ్బందిని విడిపించి కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి 20 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.