న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో ఆర్డర్ చేసే ఆహారంపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా చేసిన ఫిర్యాదుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పోరేషన్ (IRCTC) స్పందించింది. ఇక ముందు అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అదేవిధంగా రైళ్లలో ఆహారం విక్రయిస్తున్న సర్వీస్ ప్రొవైడర్కు జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. రుచి కొచ్చ అనే మహిళా రచయిత తన కుటుంబంతో కలసి పట్నా నుంచి ఢిల్లీకి బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. ఈ సందర్భంగా వెజ్ థాలి కోసం IRCTC యాప్లో ఆర్డర్ చేశారు. దాంతో వెజ్ థాలీ తెచ్చిచ్చిన సిబ్బంది బిల్లు మాత్రం వెజ్ థాలి రూ.80, పనీర్ సబ్జీ రూ.70 కలిపి రూ.150కి బిల్లు ఇచ్చారు. తాను కేవలం వెజ్ థాలి మాత్రమే ఆర్డర్ చేశానని రుచి కొచ్చ చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా వాదనకు దిగారు. గంట వాదన తర్వాత సిబ్బంది తప్పును గ్రహించిన ఓ అధికారి పాత బిల్లును క్యాన్సిల్ చేసి కేవలం వెజ్ థాలికి రూ.80 బిల్లు ఇచ్చాడు.
అయితే, ఈ ఘటన గురించి రుచి కొచ్చ ట్విటర్లో పోస్టు పెట్టారు. ఆర్డర్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో బిల్లు చూపించి డబ్బు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి ప్రవర్తన ఇండియన్ రైల్వే ప్రతిష్ఠను దిగజారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్గా మారడంతో వెంటనే ఐఆర్సీటీసీ స్పందించింది. విషయాన్ని వారి దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని పేర్కొంది. తప్పు చేసిన సర్వీస్ ప్రొవైడర్కు జరిమానా విధించింది.