శ్రీనగర్: ఒక మహిళ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని పలువురిని మోసగించింది. పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బు, బంగారంతో వరుడి ఇంటి నుంచి పారిపోతుంది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లాడుతుంది. ఇలా 12కు పైగా పెళ్లిళ్లు చేసుకుని (woman marries over 12 men) వారిని మోసగించింది. మోసాన్ని గ్రహించిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్లో ఈ సంఘటన జరిగింది. బుద్గామ్కు చెందిన మహమ్మద్ అల్తాఫ్ మీర్కు 30 ఏళ్ల షాహీన్ అక్తర్తో నాలుగు నెలల కిందట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బులు, బంగారం తీసుకుని అతడి ఇంటి నుంచి ఆమె వెళ్లిపోయింది. దీంతో జూలై 5న మహమ్మద్ అల్తాఫ్ మీర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. షాహీన్ అక్తర్ తనను మోసగించినట్లు ఆరోపించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు రాజౌరి జిల్లాలోని నౌషేరాలో ఆమె ఉన్నట్లు గుర్తించి జూలై 14న అరెస్ట్ చేశారు.
కాగా, షాహీన్ అక్తర్ తమను కూడా పెళ్లి చేసుకుని మోసగించిందని 12 మందికిపైగా వ్యక్తులు ఆరోపించారు. బెయిల్ కోసం బుద్గామ్ కోర్టును షాహీన్ ఆశ్రయించినట్లు తెలుసుకుని వారు అక్కడకు చేరుకున్నారు. తమతో వివాహం జరిగిన కొంతకాలం తర్వాత పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బులు, బంగారంతో తమ ఇళ్ల నుంచి ఆమె పారిపోయినట్లు ఆరోపించారు. షాహీన్ అక్తర్తో తమకు జరిగిన పెళ్లి ఫొటోలను చూపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంత మందిని పెళ్లి చేసుకుని మోసగించిందో అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.