తిరువనంతపురం: ఐస్క్రీమ్లో విషం కలిపి (Poisoned Ice Cream) 12 ఏళ్ల బాలుడ్ని అతడి మేనత్త చంపింది. దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 16న అరికులంలో నివసించే ఒక మహిళ తన మేనల్లుడైన 12 ఏళ్ల అహ్మద్ హసన్ రిఫాయికి విషం కలిపిన ఐస్క్రీమ్ ఇచ్చింది. అది తిన్న ఆ బాలుడు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ మరునాడు చనిపోయాడు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాలుడు అహ్మద్ హసన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ బాలుడి కుటుంబంతో గొడవలు ఉన్న మేనత్త విషం కలిపిన ఐస్క్రీమ్ను అతడికి తినిపించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు.