తిరువనంతపురం: డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒక మహిళ అడిగింది. దీంతో స్నేహితుడు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన (Kerala Woman Murder) జరిగింది. 26 ఏళ్ల అతిర తన స్నేహితుడైన అఖిల్కు డబ్బును అప్పుగా ఇచ్చింది. వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పింది. అయితే ఆ మహిళకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైంది. దీంతో బాకీ ఉన్న డబ్బును తిరిగి ఇవ్వాలని అఖిల్ను ఆమె డిమాండ్ చేసింది. ఆ డబ్బు తిరిగి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అతిరను హత్య చేయాలని అతడు నిర్ణయించాడు. తుంబూర్ముజి అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు. చున్నీతో గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఆ అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు.
కాగా, అతిర కనిపించకపోవడంతో ఆమె భర్త సనల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతిర మొబైల్ ఫోన్ సిగ్నల్ను తుంబూర్ముజి అటవీ ప్రాంతం వద్ద చివరిగా గుర్తించారు. అలాగే ఆమె చివరిసారి అఖిల్తో కనిపించినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఆమెను హత్య చేసినట్లు అఖిల్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. హత్య తర్వాత పడేసిన అతిర మృతదేహాన్ని అక్కడ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.