న్యూఢిల్లీ, నవంబర్14: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. పెండ్లి చేసుకోవాలని కోరిన పాపానికి ప్రియురాలిని ఓ యువకుడు కిరాతకంగా చంపేశాడు. ఆమెను 35 ముక్కలుగా కోసి 18 రోజులపాటు అర్ధరాత్రి దాటాక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అవయవాలను విసిరేశాడు. ఆర్నెల్ల తర్వాత వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రద్ధా వాల్కర్ (26) ముంబైలో ప్రముఖ సంస్థ కాల్సెంటర్లో పనిచేసేది. ఆమెకు 28 ఏండ్ల ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. వారి బంధాన్ని ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. వారు ముంబై నుంచి పారిపోయి వచ్చి దక్షిణ ఢిల్లీ మెహ్రౌలిలోని ఓ ఫ్లాట్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి మధ్య పెండ్లి ప్రస్తావన వచ్చి గొడవలు జరుగుతుండేవి.
మే 18న ఘర్షణ తీవ్ర రూపం దాల్చి శ్రద్ధను ఆఫ్తాబ్ చంపేశాడు. హత్య బయటకు పొక్కకుండా నిందితుడు ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. వాటిని దాచిపెట్టేందుకు 300 లీటర్ల ఫ్రిడ్జ్ను కొన్నాడు. వాసన బయటకు రాకుండా అగర్బత్తీలు వెలిగిస్తూ, రూమ్ ఫ్రెష్నర్లు కొట్టేవాడు. అర్ధరాత్రి దాటాక సుమారు 18 రోజులపాటు శరీర ముక్కలను ఢిల్లీ పురవీధుల్లో దొరక్కుండా విసిరేసేవాడు. అలా యువతి మృతదేహం జాడ లేకుండా చేశాడు. రెండు నెలలుగా శ్రద్ధ ఫోన్ కలువడం లేదని ఆమె స్నేహితులు తండ్రికి ఫిర్యాదుచేయడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. నవంబర్ 8న శ్రద్ధ తండ్రి ఢిల్లీలోని వారి ఫ్లాట్కు వచ్చి చూడగా తాళం వేసి ఉన్నది. వెంటనే ఆయన తన కూతురు కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆఫ్తాబ్ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో దారుణ హత్య ఘటన వెలుగుచూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.