లక్నో: కట్నం డిమాండ్లు తీర్చనందుకు ఒక మహిళను అత్తింటి వారు వేధించారు. హెచ్ఐవీ సోకిన సూదితో ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమె ఆరోగ్యం క్షీణించగా వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. (woman injected with HIV-infected needle) ఆ మహిళ అత్తింటి వారిపై ఆమె తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు కోర్టు జోక్యంతో కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2023 ఫిబ్రవరి 15న గంగో ప్రాంతానికి చెందిన సోనాల్ సైనీకి ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్తో పెళ్లి జరిగింది. కారు, రూ.15 లక్షలు కట్నంగా ఇచ్చారు.
కాగా, కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వారు సోనాల్ను వేధించారు. స్కార్పియో ఎస్యూవీతోపాటు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. అయితే సోనాల్ తల్లిదండ్రులు ఈ డిమాండ్లకు తలొగ్గలేదు. దీంతో భర్త, అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అయితే పెద్దల జోక్యంతో సోనాల్ తిరిగి అత్తవారింటికి వచ్చింది. నాటి నుంచి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. సోనాల్ను చంపేందుకు కుట్రపన్నారు. హెచ్ఐవీ సోకిన సూదితో ఆమెకు ఇంజెక్షన్ చేశారు.
మరోవైపు సోనాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా సోనాల్కు హెచ్ఐవీ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె భర్త అభిషేక్ను పరీక్షించగా హెచ్ఐవీ నెగిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో సోనాల్ అత్తింటి వారిపై ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు.
కాగా, పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానిక కోర్టును సోనాల్ తండ్రి ఆశ్రయించాడు. చివరకు కోర్టు ఆదేశాలపై గంగో కొత్వాలి పోలీసులు స్పందించారు. సోనాలి భర్త అభిషేక్, అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.