పాట్నా: కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న కుమార్తెపై తండ్రి, సోదరుడు కక్షగట్టారు. మహిళ, ఆమె భర్తతోపాటు రెండేళ్ల వారి పాపను దారుణంగా హత్య చేశారు. (Honour Death) బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల చాందినీ కుమారి, వయసులో 15 ఏళ్లు తేడా ఉన్న 38 ఏళ్ల చందన్ కుమార్తో పెళ్లిని ఆమె కుటుంబం వ్యతిరేకించింది. మంగళవారం సాయంత్రం 4.25 గంటలకు చాందినీ, చందన్ దంపతులు తమ రెండేళ్ల కుమార్తెతో కలిసి నవటోలియా గ్రామంలోని తమ ఇంటికి వెళ్తున్నారు.
కాగా, చాందినీ తండ్రి పప్పు సింగ్, సోదరుడు ధీరజ్ కుమార్ సింగ్ వారిని అడ్డగించారు. ఇనుప రాడ్తో కొట్టారు. ఆపై బండ రాళ్లతో మోది ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. చనిపోయారా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు తుపాకీతో వారిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చాందినీ, చందన్, వారి రెండేళ్ల పాప మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిఫుణులు కూడా అక్కడకు వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులైన చాందినీ తండ్రి, సోదరుడి కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.