భోపాల్: రైలులో ప్రయాణించిన నిండు గర్భిణీ రిజర్వేషన్ కోచ్లో ప్రసవించింది. ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. (Woman Gives Birth In Train) ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ శిశువుకు ఆ రైలు పేరు పెట్టారు. మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్లోని సత్నాకు వెళ్లేందుకు ముంబై-వారణాసి మధ్య నడిచే కామాయని ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించింది.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఆ రైలు భోపాల్, విదిషా స్టేషన్ల మధ్య ఉన్నప్పుడు ఆ మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. అదే కోచ్లో ప్రయాణించిన ఇద్దరు మహిళలు ఆమె ప్రసవానికి సహకరించారు. దీంతో ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
మరోవైపు మహిళ భర్త వెంటనే రైల్వే హెల్ప్ లైన్, ఆర్పీఎఫ్కు సమాచారం ఇచ్చాడు. దీంతో విదిషా స్టేషన్కు రైలు చేరగానే ఆ కోచ్ వద్దకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. తల్లి, బిడ్డను హర్దా జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, కామాయని ఎక్స్ప్రెస్లో పుట్టిన ఆ ఆడ బిడ్డకు ఆ రైలు పేరైన ‘కామాయని’గా నామకరణం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.