న్యూఢిల్లీ, జూలై 23: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకున్నది. నిందితులైన నలుగురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైల్వే ప్లాట్ఫాంపై ఉండే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గదిలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న హర్యానాలోని ఫరిదాబాద్కు చెందిన బాధిత మహిళతో రెండేండ్ల క్రితం ఉమ్మడి స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒకరికి పరిచయం ఏర్పడింది.
రైల్వే ఉద్యోగిగా పరిచయం చేసుకున్న అతడు.. ఉద్యోగం సైతం ఇప్పిస్తానని మహిళకు భరోసా ఇచ్చాడు. తరచూ ఫోన్లో మాట్లాడుకొనేవారు. ఈ నెల 21న తన కుమారుడి పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. వేడుక అనంతరం ఆమెను ఢిల్లీ రైల్వేస్టేషన్కు తీసుకొచ్చాడు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గదిలో కూర్చొవాలని చెప్పి వెళ్లి.. స్నేహితులతో కలిసి వచ్చాడు. తొలుత ఇద్దరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం కాప లాగా ఉన్న మరో ఇద్దరు కూడా దురాగతానికి ఒడిగట్టారు. బాధిత మహిళ తనకు జరిగిన ఘోరాన్ని శుక్రవారం అధికారులకు చెప్పారు. వారు ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో వారిని ప్రవేశపెట్టగా.. జ్యుడిషియల్ కస్టడీ విధించారు.