న్యూఢిల్లీ, మార్చి 20: ఒక బాలిక వివాహం విషయంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని వర్తింపజేసి ఆమె వివాహాన్ని రద్దు చేయాలా, లేక ముస్లిం వివాహ చట్టం ప్రకారం దానికి చట్టబద్ధత కల్పించాలా అనే న్యాయ వివాదం ఉన్న సంశయాత్మక కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసును పరిశీలిస్తామని తెలిపి రెండు వారాలకు వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. ఒక బాలిక 16 ఏండ్ల వయసులో ఒక ముస్లిం కుర్రాడిని వివాహం చేసుకుంది. అయితే ఆ కుర్రాడు తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆ బాలుడు పెట్టిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించి, ఆ బాలికను షెల్టర్ హోమ్కు తరలించి అతడిపై కేసు నమోదు చేసింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన హదియా అఖిల, సఫిన్ జాహన్ కేసులోని తీర్పు ప్రకారం బాలిక రజస్వల కావడం ముస్లిం పర్సనల్ లాలో వివాహానికి షరతుగా పేర్కొంది. ఈ కేసులో బాలిక రజస్వల అయిందని, 16 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆమె పెళ్లి చట్టబద్ధమేనని, ఈ విషయంలో హిందూ వివాహ చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం అమలు చేయడం అంటే ఆమె వ్యక్తిగత మత హక్కులలో జోక్యం చేసుకోవడమేనని ఆమె తరపున దుష్యంత్ పరాశర్
వాదించారు.