ముంబై: ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సులో వదిలేసింది. ఆ పిల్లలు అనాథలని, వారిని మరో బస్సు ఎక్కించాలని పేర్కొంటూ ఒక చీటీ రాసింది. ఒక పిల్లవాడి జేబులో ఆ చీటీ ఉంచి తన ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. (Woman Elopes With Lover) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 30న ఒక మహిళ తన తండ్రికి చెందిన స్కూటర్, కొంత డబ్బును చోరీ చేసింది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తన స్కూటర్, ఇంటి నుంచి డబ్బును కూతురు చోరీ చేసి పారిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను పండర్పూర్-సంభాజీ నగర్ బస్సులో కూర్చోబెట్టింది. ‘ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు. దయచేసి యవత్మాల్ వెళ్లే బస్సులో వారిని ఎక్కించండి’ అని పేపర్పై రాసింది. అందులో తన తండ్రి మొబైల్ నంబర్ పేర్కొంది. ఆ తర్వాత తండ్రికి చెందిన చోరీ స్కూటర్పై ప్రియుడితో కలిసి పారిపోయింది.
మరోవైపు ఆ బస్సు బీడ్ చేరుకోగా అందులో ఉన్న ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటాన్ని బస్ కండక్టర్ గమనించాడు. ఒక పిల్లవాడి జేబులో ఉన్న చీటీ తీసి చదివాడు. ఆ పిల్లలను వారి తల్లి బస్సులో వదిలేసినట్లు తెలుసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించాడు.
అయితే, ఆ చీటీలో ఉన్న మొబైల్ నంబర్ పిల్లల తాతదిగా పోలీసులు తెలుసుకున్నారు. యవత్మాల్లో నివసిస్తున్న ఆయనకు ఫోన్ చేసి బీడ్ పోలీస్ స్టేషన్కు రప్పించారు. అయితే అక్కడకు చేరుకున్న ఆయన ఆ పిల్లల కంటే తన స్కూటర్ గురించి ఎక్కువ ఆందోళన చెందాడు. మనవళ్ల సంరక్షణ బాధ్యత తీసుకునేందుకు ఆయన నిరాకరించాడు.
కాగా, ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు తన ఇద్దరు పిల్లలను వదిలేసి అతడితో కలిసి ఆ మహిళ పారిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. తాత కూడా పిల్లలను తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో బీడ్ బాలల సంక్షేమ కమిటీకి పోలీసులు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారిని శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చించారు.