న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ విద్యుదాఘాతంతో మరణించింది (Woman electrocuted to death). ఈ సంఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి అహుజా అనే మహిళ తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపాల్ వెళ్లే రైలు ఎక్కేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అయితే భారీ వర్షం నేపథ్యంలో రైల్వే స్టేషన్ బయట వర్షం నీటితో నిండి ఉన్న రోడ్డును దాటుతూ సపోర్ట్ కోసం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుంది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. సమీపంలో ఉన్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరెంట్ షాక్కు గురై అచేతనంగా పడి ఉన్న ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా, విద్యుత్ పోల్ నుంచి బయటకు వేలాడుతున్న వైర్లకు ఇన్సులేషన్ లేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వైర్ల ద్వారా కరెంట్ లీక్ కావడంతో విద్యుత్ స్తంభానికి సరఫరా అయ్యిందని చెప్పారు. మృతురాలు సాక్షి అహుజా సోదరి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది.