Delhi Incident | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కాంజావాలా ఘటనపై పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన యువతిని కారు కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే ఈడ్చుకెళ్లిందని మొదట్లో పోలీసులు చెప్పారు. కానీ తాజాగా బయటకొచ్చిన వివరాల ప్రకారం ఆమెను 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు స్పష్టం చేశారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. నిందితులను ఘటనాస్థలికి కూడా తీసుకెళ్లి.. విచారిస్తామని చెప్పారు. దర్యాప్తు వివరాలను మృతురాలి పేరెంట్స్కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అయితే బాధితురాలి కాలు విరిగిపోవడం, బట్టలు లేకుండా ఉన్న ఓ ఫుటేజీ బయటకు వచ్చింది. దీంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరగలేదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు సుల్తాన్పురి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.