అహ్మదాబాద్ | పోలీస్ క్రైం బ్రాంచ్ కార్యాలయంలో ఒక వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. (Doctor’s body) ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. లేడీ డాక్టర్ సూసైడ్ నోట్లో ఒక పోలీస్ అధికారి పేరు ఉందని పోలీసులు వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోని బెంచ్పై ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సమీపంలో సిరంజ్లు ఉండటంతో విష ఇంజక్షన్ ద్వారా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. మృతురాలిని డాక్టర్ వైశాలి జోషిగా గుర్తించారు. పీజీ రెసిడెంట్ డాక్టర్ అయిన ఆమె అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు.
కాగా, డాక్టర్ వైశాలి బ్యాగ్లో 15 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు కనుగొన్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వీకే ఖచర్ పేరు అందులో ఉందని తెలిపారు. ఐదేళ్లుగా సంబంధం ఉన్న ఆ పోలీస్ అధికారి తీరుతో విసుగు చెంది జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉందన్నారు. ఆర్థిక నేరాల నిరోధక విభాగంలో ఆ అధికారి విధులు నిర్వహిస్తున్నాడని, ఈ నేపథ్యంలో అక్కడి బెంచ్పై డాక్టర్ వైశాలి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.