ముంబై: ఒక బస్సు గోడను ఢీకొట్టింది. ఆ గోడ కూలడంతో అక్కడ ఉన్న యువతి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. (woman dies) మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో 19 ఏళ్ల యువతి తన తమ్ముడ్ని పిక్నిక్ పంపేందుకు స్కూల్ వద్దకు తీసుకెళ్లింది. స్కూల్ బస్సులో టూర్కు బయలుదేరిన సోదరుడికి బై చెప్పింది. అనతరం ఆ స్కూల్ సరిహద్దు గోడ వద్ద ఆమె నిల్చొని ఉంది.
కాగా, ఇంతలో రివర్స్లో వచ్చిన ప్రైవేట్ బస్సు ఆ స్కూల్ గోడను ఢీకొట్టింది. దీంతో ఆ గోడ కొంత భాగం కూలిపోయింది. అక్కడ ఉన్న యువతి మీద గోడ శిథిలాలు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువతి చనిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.