లక్నో: మరిదితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడంతోపాటు భర్త ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్రపన్నింది. మరిదితో కలిసి గొంతునొక్కి భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు భర్తది హత్యగా నిర్ధారించి వారిద్దరిని అరెస్ట్ చేశారు. (Woman kills husband) ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖేతల్పూర్ భైన్సోలి గ్రామంలో నివసిస్తున్న 35 ఏళ్ల సుమిత్, 30 ఏళ్ల కాజల్ భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం వివాహమైన వారికి రెండేళ్ల వయసున్న ఒక బిడ్డ ఉన్నది.
కాగా, ఆగస్ట్ 31న సుమిత్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. సుమిత్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అతడు సూసైడ్ చేసుకున్నట్లు పొలీసులు కూడా తొలుత భావించారు. అయితే గొంతు నొక్కడం వల్ల సుమిత్ మరణించినట్లు పోస్ట్మార్టం నివేదికలో వచ్చింది. దీంతో భార్య కాజల్, అతడి సోదరుడైన 30 ఏళ్ల ఉమేష్పై పోలీసులు అనుమానించారు.
మరోవైపు మరిది అయిన ఉమేష్తో కాజల్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఫోన్కాల్స్ రికార్డులు, ఇతర ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాన్ని కొనసాగించడంతోపాటు సుమిత్ ఆస్తిని దక్కించుకునేందుకు వారిద్దరూ కలిసి అతడ్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
ఈ నేపథ్యంలో కాజల్, ఉమేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని వారు అంగీకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.