చెన్నై: సీడీఎస్ బిపిన్ రావత్ సహా 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలిక్యాప్టర్ నీలగిరి కొండల్లో కూలుతున్న సమయంలో భారీ శబ్దం వినిపించిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి తెలిపాడు. తాను ఇంట్లో ఉండగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించిందని అతను చెప్పాడు. ఏం జరిగిందో చూద్దామని బయటికి వచ్చేసరికి హెలిక్యాప్టర్ చెట్టును ఢీకొడుతూ కనిపించిందన్నాడు. ఆ వెంటనే దానిలో మంటలు చెలరేగాయని, మండుతూనే మరో చెట్టును ఢీకొట్టి కూలిపోయిందని వెల్లడించాడు. కూలడానికి ముందు మంటల్లో కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు జారిపడటం కనిపించిందని చెప్పాడు.