కొచ్చి, సెప్టెంబర్ 2: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను భారత నావికా దళంలోకి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. దీంతోపాటు భారత నౌకా దళానికి సరికొత్త చిహ్నాన్ని (నిషాన్) కూడా ఆయన ఆవిష్కరించారు. కొచ్చిన్ షిప్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన దిశగా వేస్తున్న అడుగులకు విక్రాంత్ సరైన ఉదాహరణ అన్నారు. భారత నైపుణ్యాలు, ప్రతిభకు విక్రాంత్ నిదర్శనమన్నారు. విక్రాంత్ ఓ తేలియాడే నగరమని అభివర్ణించిన ప్రధాని.. ఈ నౌక ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఐదు వేల గృహాలకు కరెంటు సరఫరా చేయవచ్చన్నారు.
అనంతరం నావికాదళం సరికొత్త పతాకాన్ని ఎగురవేసిన మోదీ.. శివాజీ స్ఫూర్తితో కొత్త చిహ్నాన్ని రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ కొత్త గుర్తుతో భారత్ బానిసత్వ గుర్తులను చెరిపేసుకున్నదన్నారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, కేరళ సీఎం విజయన్ పాల్గొన్నారు. కాగా, ఐఎన్ఎస్ విక్రాంత్ను నావికాదళంలోకి తీసుకురావడంలో గత ప్రభుత్వాలు కూడా కృషిచేశాయని కాంగ్రెస్ గుర్తుచేసింది. తమ సర్కారు వల్లే విక్రాంత్ సాధ్యమైనట్టు మోదీ వ్యాఖ్యానించడం ఆయన కపటబుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా వద్ద మాత్రమే ఇప్పటిదాకా ఈ సామర్థ్యం ఉండేది.
దేశీయంగా తయారు చేసిన పరికరాలతోనే నౌక నిర్మాణాన్ని వరకూ చేపభారీ పరిశ్రమలు, వందకు పైగా ఎంఎస్ఎంఈలు విక్రాంత్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.
విక్రాంత్ డిజైన్ను భారత నౌకాదళంలోని వార్షిప్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్యార్డ్ పూర్తి చేసింది. నిర్మాణం పూర్తవ్వడానికి 13 ఏండ్ల సమయం పట్టింది.
యుద్ధ నౌకకు అవసరమైన స్టీల్ను సెయిల్, డీఆర్డీవో అందజేశాయి.
ఈ నౌకలో పూర్తిస్థాయి మెడికల్ కాంప్లెక్స్ ఉంది. ఫిజియోథెరపీ, ఐసీయూ, సీటీ స్కాన్, పరీక్షశాలలతో పాటు మహిళా అధికారులకు ప్రత్యేక క్యాబిన్లు కూడా ఉన్నాయి. రోజుకు 16 వేల చపాతీలు, 6 వేల ఇడ్లీలు తయారుచేసే ఆటోమెటిక్ మెషీన్లు వంటశాలలో ఉన్నాయి.
మిగ్-29 కే ఫైటర్ జెట్లు, కమావ్-31, హెచ్ఆర్-60ఆర్, ఏఎల్ హెచ్ హెలికాఫ్టర్లు సహా 30 యుద్ధ విమానాల వరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ నౌకపై సమర్థంగా నిర్వహించవచ్చు.
గతంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ (ఓల్డ్) నావికాదళంలో ఉండేది. 1957లో యూకే నుంచి దీన్ని కొనుగోలు చేయగా.. 1961 లో నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషించింది. 1997లో నేవీ నుంచి దీని సేవలను ఉపసంహరించి.. 2014లో తుక్కుగా విక్రయించారు.
ప్రస్తుత ఐఎన్ఎస్ విక్రాంత్ కాకుండా మరొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎస్ఎస్ విక్రమాదిత్య మాత్రమే నేవీలో ఉంది. వాస్తవానికి మూడు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉండాలని నావికాదళం భావిస్తున్నది. హిందూ మహా సముద్రంలో ఒక నౌకను, బంగాళాఖాతంలో మరొకదాన్ని మోహరించగా.. మూడోదాన్ని ముందుజాగ్రత్త చర్యలో భాగంగా సిద్ధంగా ఉంచాలన్నది నేవీ ఆలోచన. అయితే, ప్రస్తుతం రెండే విమాన వాహక నౌకలు అందుబాటులో ఉన్నాయి.
నేవీ కొత్త నిషాన్ విశేషాలు
నౌకాదళానికి ఇప్పటివరకూ ఉన్న గుర్తు.. దేశ వలసవాద గతాన్ని గుర్తుచేసేలా ఉన్నదన్న కారణంతో కేంద్రం కొత్త చిహ్నాన్ని తీసుకొచ్చింది.
కొత్త చిహ్నంలో రెండు భాగాలు ఉన్నాయి.. ఎడమవైపు పైభాగంలో జాతీయ పతాకం, రెండో భాగంలో నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో చిహ్నాన్ని ఉంచారు.
అష్టభుజాకారం.. నేవీ బహుల దిశల పరిధి, బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. యాంకర్ చిహ్నం స్థిరత్వానికి గుర్తుగా, నీలం రంగు నావికాదళ సముద్ర సామర్థ్యానికి ప్రతీకగా రూపొందించారు. పతాకంలోని తెలుపు రంగు భారత నౌకాదళ ప్రస్తుత సామర్థ్యాలను, నిర్మాణాలను, నౌకలను ప్రతిబింబిస్తుంది.