హైదరాబాద్/ న్యూఢిల్లీ, జూలై 25: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ఐక్యతా సందేశమిచ్చారు. దేశప్రజలంతా విభేదాలు మాని జాతీయ సమైక్యతను మరింత పెంపొందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా నిర్వహించే మన్కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ పోటీలో పాల్గొంటున్న భారత క్రీడాకారులు విజేతలుగా నిలిచి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు మద్దతుగా సోషల్మీడియాలో ప్రారంభమైన ‘హమారా విక్టరీ పంచ్’ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఆగస్టు 15న భారత్ 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని తెలిపారు. మహాత్మాగాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా ‘ఐక్యతా భారత్ ఉద్యమం’ (భారత్ జోడో ఆందోళన్) చేపట్టామని చెప్పారు. దేశ ఐక్యతను చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ జాతీయగీతాన్ని ఆలపించి రికార్డుచేసి, కేంద్ర సాంస్కృతికశాఖ ప్రత్యేకంగా ప్రారంభించిన ‘rashtragan.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దృష్టిలో పెట్టుకొని నాటి పోరాట ఘట్టాలను, సమరయోధులను గుర్తుచేసుకొనేందుకు అమృత్ మహోత్సవ్ ప్రారంభించామని గుర్తుచేశారు. జూలై 26 కార్గిల్ దివస్ సందర్భంగా 1999లో దేశం కోసం యుద్ధం చేస్తూ అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించాలని పిలుపునిచ్చారు.
ఏపీ వెదర్ మ్యాన్కు ప్రధాని ప్రశంస
ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్న తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. సాయిప్రణీత్ అందిస్తున్న సమాచారం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని కొనియాడారు.