Wipro Layoffs | న్యూఢిల్లీ, జనవరి 31: ఉద్యోగాల ఊచకోత కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్నది. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చులు తగ్గింపు, ఆదాయాలు మెరుగుపర్చుకొనే ప్రణాళికలో భాగంగా వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఇప్పటికే ఆ జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు ఉండగా.. తాజాగా యునైటెడ్ పార్సిల్ సర్వీస్(యూపీఎస్), ఫిక్ టెక్ సంస్థ పేపాల్, ఐటీ కంపెనీ విప్రోలు తమ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటనలు చేశాయి.
లాభాలు పెంచుకొనేందుకు..
మధ్య స్థాయి ఉద్యోగులే లక్ష్యంగా ఐటీ సంస్థ విప్రో ఉద్యోగుల తొలగింపు చేపట్టనున్నట్టు ది ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. తగ్గిన ఆదాయాలను మెరుగుపర్చుకొనే ప్లాన్లో భాగంగా వందలాది ఉద్యోగులుపై కంపెనీ వేటు వేయనున్నదని, తొలగింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సంబంధిత వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నది. భారత్లోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో విప్రోకు అతి తక్కువ లాభాలు ఉన్నాయని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో విప్రో లాభాలు 16 శాతం వద్ద ఉండగా.. ఇది టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ అని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది.
9% ఉద్యోగులపై పేపాల్ వేటు
9 శాతం మంది ఉద్యోగులను(2,500 మంది) తొలగించనున్నట్టు పేపాల్ సీఈవో అలెక్స్ క్రిస్ తాజాగా ప్రకటించారు. సమర్థత, ఆటోమేషన్ వినియోగం, వ్యాపారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని అనుకొంటున్నట్టు ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఆయన పేర్కొన్నట్టు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. తొలగింపునకు సంబంధించి ఈ వారం చివర్లో తెలియజేస్తామని మెమోలో తెలిపారు. పేపాల్ ఇదివరకే దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
ఖర్చుల తగ్గింపులో భాగంగా
ఆర్థిక సవాళ్లు, ఖర్చుల తగ్గింపులో భాగంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు యునైటెడ్ పార్సిల్ సర్వీస్(యూపీఎస్) ప్రకటించింది. వాల్స్ట్రీట్ అంచనాల కంటే వార్షిక ఆదాయాలు తగ్గిన నేఫథ్యంలో, దీనికి స్పందనగా ప్రత్యామ్నాయ వ్యూహాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. దాదాపు 100 కోట్ల డాలర్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలని లక్ష్యం పెట్టుకొన్నట్టు యూపీఎస్ సీఈవో కరోల్ టోమ్ వెల్లడించారు. గత ఏడాది ఎదురైన ప్రతికూలతను అధిగమించాలని అనుకొంటున్నామని ఆయన తెలిపారు.