న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కొత్త భవనంలో సమావేశాలను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, కొత్త భవనం భారతదేశ స్వావలంబన చిత్రాన్ని స్పష్టంగా చూపుతుందని ఓం బిర్లా అన్నారు. సాంకేతికత, భద్రతపరంగా చూస్తే పాత భవనంతో పోలిస్తే కొత్త భవనం ఎంతో ముందుంటుందని తెలిపారు. పాత భవనం కొత్తదాంట్లోనే భాగం అవుతుందని అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో సభ ఉత్పాదకత స్థాయి ఎంతగానో పెరిగిందని, ఇప్పుడు అర్ధరాత్రి వరకు సభ నడుస్తుందన్నారు. అన్ని పార్టీలు తమ తమ నేతలతో మాట్లాడాలన్నారు. పార్టీల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి సభ సజావుగా సాగాలని, క్రమశిక్షణ పాటించాలని వారికి చెబుతున్నానన్నారు. ఎంపీల ఇంటికే పుస్తకాలను పంపిస్తున్నామన్నారు. ఎంపీల కోసం జాబితా చేసిన బిల్లులపై నిపుణుల తరఫున లోక్సభ సెక్రటేరియట్ బ్రీఫింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తోందని చెప్పారు.
పరిశోధన ఆధారిత సమాచారం సైతం ఎంపీలకు ఇవ్వబడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్లమెంట్ కొత్త భవనానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేసింది. మరో వైపు కొత్త పార్లమెంట్ భవనం ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.