న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ప్రజలకు గురువారం భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఆరోగ్యం, వయస్సు పైబడటంతో వచ్చే సమస్యల కారణంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ‘నేను ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా అదంతా మీ వల్లనే అని గర్వంగా చెబుతున్నా. మీ నమ్మకాన్ని గౌరవించడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషిచేశా. ఇప్పుడు ఆరోగ్యం, వయస్సు సమస్యల కారణంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తర్వాత మీకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండదు. కానీ నా హృదయం, ఆత్మ ఎప్పుడూ మీతోనే ఉంటాయి’ అని హిందీలో రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, 2004 నుంచి వరుసగా రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 77 ఏళ్ల సోనియా గాంధీ, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పరోక్షంగా తెలిపారు. ‘గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ నాకు, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారని నాకు తెలుసు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.