రాంచీ/న్యూఢిల్లీ, జనవరి 30: జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. భూకుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయడం, సీఎం హేమంత్ సొరేన్ను మరోసారి బుధవారం ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్న నేపథ్యంలో అనేక వార్తలు షికారు చేస్తున్నాయి.
అందులో ఒకవేళ ఈడీ హేమంత్ సొరేన్ను అరెస్టు చేస్తే.. ఆయన భార్య కల్పనా సొరేన్కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనేది ప్రధానమైనది. ఈ మేరకు అధికార జేఎంఎం ‘ప్లాన్-బీ’ని ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లిన తర్వాత కొన్ని గంటల పాటు అందుబాటులో లేని సీఎం హేమంత్ సొరేన్.. మంగళవారం రాంచీలో దర్శనమిచ్చారు.
ఢిల్లీ నుంచి ఆయన రోడ్డు మార్గంలో వచ్చారని సొరేన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వెంటనే ఆయన తన అధికారిక నివాసంలో జేఎంఎం, సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కల్పనా సొరేన్ కూడా హాజరు కావడం.. రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించిన జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్టు సమాచారం.
అందుబాటులో లేకుండా పోయిన సొరేన్..
ఈనెల 20న సొరేన్ను ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. ఈ నెల 29 లేదా 31న మరోసారి అందుబాటులో ఉండాలని సమన్లు ఇచ్చింది. ఓ ప్రభుత్వ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మరీ సొరేన్ 27న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రశ్నించేందుకు ఈడీ బృందం సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లగా.. అందుబాటులో లేరని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.36 లక్షల నగదు, ఒక బీఎండబ్ల్యూ కారు, పలు పత్రాలను సీజ్ చేసినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రాజకీయ అజెండాతో ప్రేరేపితం అయినట్టుగా ఈడీ చర్యలు ఉన్నాయని హేమంత్ సొరేన్ గత ఆదివారం ఈడీకి పంపిన మెయిల్లో ఆరోపించారు. రాంచీలోని తన నివాసంలో ఈనెల 31న తన స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. కాగా, అరెస్టు భయంతోనే సొరేన్ పారిపోయారంటూ బీజేపీ విమర్శలు చేసింది. తమ నేత ఎవరికీ భయపడబోరని, బీజేపీ, ఈడీ కలిసి కుట్రలు చేస్తున్నాయని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య అన్నారు.
సీఎస్, డీజీపీలతో గవర్నర్ భేటీ
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సీఎస్, డీజీపీలను రాజ్భవన్కు పిలిపించుకొని మాట్లాడటం కూడా ప్రాధాన్యం సంతరించుకొన్నది. సమావేశం అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 7 వేల మంది అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు. రాంచీలోని సీఎం సొరేన్ నివాసం, రాజ్భవన్, ఈడీ కార్యాలయంతో సహా పలు ఏరియాల్లో నిషేధాజ్ఞలు విధించినట్టు అధికారులు వెల్లడించారు.
గతంలో తండ్రి శిబు కూడా..!
గతంలో హేమంత్ తండ్రి శిబు సొరేన్ కూడా ఓసారి ఇలాగే కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయారు. 2004లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శిబు సొరేన్పై అరెస్టు వారెంట్ జారీ అయింది. కొన్ని దశాబ్దాల క్రితం జార్ఖండ్లోని చిరుదిలో జరిగిన ఘర్షణల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఆయన్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. వారెంట్ జారీ తర్వాత కనిపించకుండా పోయిన శిబు సొరేన్ కోసం పోలీసు బృందాలు జార్ఖండ్, ఢిల్లీల్లో విస్తృతంగా గాలించాయి. చివరకు 10 రోజుల తర్వాత ప్రత్యక్షమైన రాంచీలో ప్రత్యక్షమైన ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని, జార్ఖండ్ అడవుల్లో ఉన్న గ్రామాలకు వెళ్లానని అప్పుడు చెప్పడం గమనార్హం.