Bihar | పాట్నా, ఫిబ్రవరి 11: జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సోమవారం బీహార్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉంచారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆదివారం పాట్నాలో ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యే సమావేశానికి ముగ్గురు జేడీయూ సభ్యులు గైర్హాజరవ్వటం కలకలం రేపింది. అయినప్పటికీ..నేడు జరగబోయే బలపరీక్షలో గెలుస్తామని సీఎం నితీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహాగట్బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్)), ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఆర్జేడీ ఎమ్మెల్యేలందర్నీ తేజస్వీ యాదవ్ గృహ నిర్బంధంలో ఉంచారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తమని చెబుతూ ఆర్జేడీ..సోషల్మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా గయలోని మహాబోధి రిసార్ట్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఆదివారం ప్రత్యేక బస్సులో పాట్నాకు చేరుకున్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. బీజేపీ-78, జేడీయూ-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఐఎన్డీ-1లతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 128 మంది ఎమ్మెల్యేల బలమున్నట్టు సమాచారం. మహాగట్బంధన్ పేరుతో ఒక్కటైన ఆర్జేడీ-79, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది.