చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ శనివారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్ను వ్యతిరేకించే వారి కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న బీజేపీ నేత మనీష్ గ్రోవర్ను రైతులు శుక్రవారం ఘెరావ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను పని లేని తాగుబోతులని ఆయన విమర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మనీష్ గ్రోవర్ గుడిలో ఉన్నట్లు తెలిసి దానిని చుట్టుముట్టారు. సుమారు 8 గంటల పాటు గుడిలో ఉన్న బీజేపీ నేతలను నిర్బంధించారు. గ్రోవర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చివరకు చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. దీనిపై హర్యానాలోని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. అయితే తాను ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని అనంతరం గ్రోవర్ అన్నారు. చేతులు ఊపాలని తనను కోరగా తాను అలా చేసినట్లు చెప్పారు.
మరోవైపు రోహతక్ బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ, ఈ పరిణామాలపై స్పందించారు. తమ పార్టీ నేత గ్రోవర్కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ నేతల కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని ఆయన హెచ్చరించారు. హర్యానాలో 25 ఏండ్లు తాము అధికారంలో ఉంటామని, కాంగ్రెస్ చక్కర్లు కొడుతుందని విమర్శించారు.